స్మశానం కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేయాలని తహశీల్దార్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్

స్మశానం కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేయాలని తహశీల్దార్ ప్రభాకరరావును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించిన సంఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే గత శనివారంనాడు స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 853/2 నందు స్మశానాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసిన విషయంపై బుధవారం నాడు పొదిలి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేయగా కలెక్టర్ సదరు కబ్జాదారులపై కేసు నమోదు చేయాలని తహశీల్దార్ ప్రభాకరరావును ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ స్మశానాలు, చెఱువులు, కుంటలు కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న తహశీల్దార్ కు ఆదేశాలు జారీచేశారు.