కోట్ల రూపాయల భూమి సదును స్కాం పై విచారణ జరిపించాలి: కందుల

కోట్ల రూపాయల భూమి చదును స్కాం పై విచారణ జరిపించాలని మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం స్థానిక చిన్న చెరువు సమీపంలోని పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 1177నందు పేదలకు నివేశన స్థలాలు పంపిణీ కోసం తలపెట్టిన భూమి చదును పనులకు 50లక్షల రూపాయల వ్యయం సరిపోయే పనికి కోట్లాది రూపాయల అంచనాలతో పనులు చేసి……. కోట్లాది రూపాయలను వైసిపి నాయకులు మరియు ప్రజాప్రతినిధులు తమ జేబులో వేసుకున్నారని ఆరోపించారు.

ఇటివల జిల్లా కలెక్టర్ భూమిని చూసి అందంగా ఆకర్షణీయంగా ఉందని తెలిపారని…. కాని ఆ అందం ఆకర్షణీయం వెనుక ఉన్న భూమి చదును మట్టి స్కాం విచారించలేదని తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు కోట్లాది రూపాయల భూమి స్కాం పై విచారణ జరిపించాలని లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులైన ఉపాధి హామీ పథకం సంబంధించిన శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని పొదిలి టైమ్స్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు పండు అనీల్, యర్రమూడి వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.