పినాకిని గ్రామీణ బ్యాంకు మాజీ డైరెక్టర్ వెన్నెల మృతి…..

పినాకిని గ్రామీణ బ్యాంకు మాజీ డైరెక్టర్ మరియు సినియర్ నాయకులు వెన్నెల వెంకటేశ్వరరావు(71)గుండె పోటుతో మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా అనారోగ్యంతో భాధ పడుతున్న వెన్నెల గుద్దేటి వారి వీధిలోని ఆయన స్వగృహంలో బుధవారం తెల్లవారుజమున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పొదిలి పట్టణంలోని సీనియర్ నాయకులలో ఒకరైన వెన్నెల తొలుత ప్రభుత్వం ఉద్యోగంలో చేరి అటుపిమ్మట్ట 1975లో సినిమా పరిశ్రమకి మద్రాసు చేరగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతో….. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక భావం ఏర్పడి అనంతరం తన సహచరులు మాజీ మంత్రి వెన్నా వెంకట నారాయణరెడ్డితో జనతా పార్టీలో చేరి రాష్ట్ర నాయకులు తమ్మలపాటి సత్యనారాయణ మొదలైన సోషలిస్టు నాయకులతో సన్నిహితంగా మెలిగారు.

1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి కీలకపాత్ర వహించారు. అనంతరం 1985లో దరిశి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అయ్యే చివరి నిమిషంలో మాజీ మంత్రి కాటూరి నారాయణస్వామి ఒత్తిడి మేరకు పార్టీ అధిష్టానం తలొగ్గి చివరకు శ్రీరామలుకు టికెట్ కేటాయించగా ఆయన విజయానికి ఎంతో కృషి చేశారు.

అనంతరం 1987లో కొత్త మండల వ్యవస్థ ఏర్పడిన సమయంలో మండల అధ్యక్షులుగా పోటీ చేయడానికి కాటూరి ఒత్తిడితో పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వలేకపోయింది. 1983లో పట్టుపరిశ్రమ కార్పొరేషన్ డైరెక్టర్ గా….. 1987లో మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా…. అదే సమయంలో ఒక సంవత్సరం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జిల్లాలో ముఖ్య అనుచరుడిగా అదేవిధంగా 1988లో రంగా హత్య నేపథ్యంలో పార్టీలోనే ఉన్నారు. 1989ఎన్నికలలో దరిశి నియోజకవర్గ తెదేపా టికెట్ కేటాయించకపోవడంతో 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు డైరెక్టర్ గా 12సంవత్సరాల పాటు పని చేశారు.

ఆయన డైరెక్టర్ గా కొనసాగిన సమయంలోనే పొదిలిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో పిసిసి కార్యదర్శిగా నియమించారు. అనంతరం 2009ఎన్నికల సమయంలో వైఎస్ అధికారంలోకి రాగానే శాసనమండలి సభ్యులుగా చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే వైఎస్ మృతితో రాజకీయాలకు వెన్నెల దూరంగా ఉన్నారు.

వెన్నెలకు దర్శకుడు దాసరి సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు, జిల్లాలో మాజీ మంత్రి వెన్నా వెంకట నారాయణరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడులు అత్యంత సన్నిహితులు.

బుధవారంనాడు వెన్నెల అకాల మరణం గురించి తెలుసుకున్న పలువురు నాయకులు సంతాపాన్ని తెలిపారు. ఆయన అంతిమ యాత్ర గురువారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.